బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కీలక నేత.. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అన్న హరీష్ రావు

Update: 2023-10-27 14:22 GMT

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ డక్ ఔట్, కాంగ్రెస్ రన్ ఔట్ అవుతాయని మంత్రి హరీష్ రావు అన్నారు. కానీ కేసీఆర్ మాత్రం సెంచరీ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సహా పలువురు బీఆర్ఎస్లో చేరారు. వారికి హరీష్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఖాతా తెరవదని.. సర్వేలు సైతం ఇదే విషయం చెబుతున్నాయని మంత్రి అన్నారు. కాంగ్రెస్ అంటేనే మాటలు, ముఠాలు, మంటలు అని ఆరోపించారు.

రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉండాలా.. బలహీనమైన నాయకత్వం ఉండాలా అనేది ప్రజలే తేల్చుకోవాలని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ది రైతుల ఎజెండా అయితే కాంగ్రెస్ది బూతుల ఎజెండా అని విమర్శించారు. బూతులు మాట్లాడటం చాలా సులువు కానీ నీళ్ళు, కరెంట్, రైతు బంధు ఇవ్వడం చాలా కష్టమన్నారు. ఒకవైపు ఐటీ.. మరోవైపు వ్యవసాయ అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తోందని చెప్పారు. కేసీఆర్ పాలనలో కరువు, కర్ఫ్యూ లేదని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ అవి వస్తాయని ఆరోపించారు.

సన్నీ డియోల్, రజినీ కాంత్ లాంటి స్టార్స్ హైదరాబాద్ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారని హరీష్ రావు అన్నారు. రజినీకి అర్ధమైంది.. ఇక్కడి గజినీలకు అర్ధమవడం లేదని విమర్శించారు.

ధాన్యం ఉత్పత్తి 99 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2 కోట్ల 48 లక్షలకు చేరిందన్నారు. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయ్యేది ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


Tags:    

Similar News