Rythu Bandhu: ఎకరానికి రూ.7500.. రైతుబంధుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ కీలక ప్రకటన

Byline :  Veerendra Prasad
Update: 2023-12-11 06:32 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రైతుబంధు అంశంపై.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య రసాభాస జరిగిన తెలిసిందే. నిబంధనలకు విరుద్దంగా రైతుబంధు నిధులను చెల్లిస్తుందంటూ గత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై సమీక్షించిన ఈసీ.. రైతుబంధు నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ కారణంగా అవి అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానం దక్కించుకోగా... కొత్త ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాల్లో ‘రైతుబంధు’ డబ్బులు ఎప్పుడు జమచేస్తుందని రైతులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్(ఈ నెల) చివరిలోగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు వేయనుందని తెలిపారు. సాగుచేసే నిజమైన రైతులకే రైతుబంధు పెట్టుబడి సాయం అందజేసేలా ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తుందని అన్నారు. డిసెంబరు చివరి నాటికి రైతుల అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు వేయనుందని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఎకరాకు రూ.7500 చొప్పున సాయం అందజేయనున్నామని చెప్పారు.

కొందరు భూస్వాములు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వందల ఎకరాలను సాగు భూములుగా చూపిస్తూ రైతు బంధు సాయం పొందుతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. దీనిపై పునరాలోచన చేస్తామని, ధరణిలో తప్పొప్పులను పరిశీలించి హామీ ఇచ్చినట్టుగా సాగుభూములకు రైతుబంధు వేస్తామన్నారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని, అయినప్పటికీ కేవలం ఆరు గ్యారంటీలతోపాటు ఇతర ప్రజా సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపేదిలేదని అన్నారు. ఆదివారం సారంగాపూర్‌ మండలంలోని రేచపల్లిలో ఆర్టీసీ బస్సు సేవలను జీవన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Tags:    

Similar News