బీఆర్ఎస్ బానిసత్వ పార్టీ.. కేటీఆర్ ఓ బచ్చాగాడు - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Byline :  Kiran
Update: 2023-09-13 13:32 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ ఓ బచ్చాగాడని అన్నారు. అతను ఐటీ మంత్రిగా కాకుండా విదేశాంగ మంత్రిలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. నెలకు 15 రోజులు విదేశాల్లో ఉండే కేటీఆర్కు తెలంగాణ ప్రజల అవసరాలు ఎలా తెలుస్తాయని అన్నారు. రాష్ట్ర ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర లేదనేందుకు కేటీఆర్కు ఎంత బలుపని వెంకట్ రెడ్డి మండిపడ్డారు.

70 నుంచి 80 సీట్లు

సోనియా గాంధీ దయ వల్లే రాష్ట్రం ఏర్పడిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ బానిసత్వ పార్టీ అయితే కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 70 నుంచి 80 అసెంబ్లీ స్థానాలు గెలవడం పక్కా అన్న ఆయన.. అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి పవర్ లేని పవర్ మంత్రి అన్న వెంకట్ రెడ్డి అతని గురించే మాట్లాడనని అన్నారు. కొడుకుకు టికెట్ రాకపోవడంతో గుత్తా సుఖేందర్ రెడ్డికి చిప్ దొబ్బిందిని, అందుకు తనను తిడుతున్నాడని అన్నారు. ఆ విషయం కేసీఆర్ తో తేల్చుకోవాలని తనను తిడితే ఏమొస్తుందని చెప్పారు.

కాంగ్రెస్లో ఖాళీల్లేవ్

ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో ఇప్పటికి చాలా మంది లీడర్లు ఉన్నారని, కొత్తవారికి అవకాశం లేదని వెంకట్ రెడ్డి అన్నారు. క్యారెక్టర్ లేని వాళ్లను కాంగ్రెస్ లో చేర్చుకోమని స్పష్టం చేశారు. గురువారం నుంచి నల్లగొండలో ప్రచారం ప్రారంభిస్తానన్న ఆయన.. గతంలో కన్నా ఈసారి ఎక్కువ మెజార్టీతో నల్లగొండ రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలుస్తుందని అన్నారు.

కమిషన్లపై కోర్టుకెళ్తా

ప్రభుత్వ పథకాల్లో స్థానిక లీడర్లు కమిషన్లు దండుకోవడంపై హైకోర్టుకు వెళ్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు వేయలేని కేసీఆర్ ప్రభుత్వానికి విపక్షాలను విమర్శించే స్థాయి ఉందా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ఎప్పుడూ మద్దతు ఇస్తుందన్న వెంకట్ రెడ్డి తాము అధికారంలోకి రాగానే అందరి సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 17న సోనియా గాంధీ నేతృత్వంలో జరిగే విజయ భేరి సభను అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.




Tags:    

Similar News