జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు

Byline :  Vamshi
Update: 2024-03-28 07:18 GMT

జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆయన ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో నిబంధనల మేరకు ఈసీ చర్యలు తీసుకుంది. ఈనెల 23న పెంబర్తి బైపాస్ రోడ్డు సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభ కార్యక్రమంలో ఏసీపీ పాల్గొన్నారు.

కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఏసీపీ దామోదర్ రెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. పొలిటికల్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఏసీపీ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం ఏసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ.. నిబంధనల మేరకు డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News