Shakeel's son: హైకోర్టును ఆశ్రయించిన షకీల్‌ కుమారుడు.. నేడే విచారణ

Byline :  Veerendra Prasad
Update: 2024-01-09 05:35 GMT

మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ హైకోర్టును ఆశ్రయించాడు. పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. పోలీసులు కావాలనే తనను నిందితుడిగా ఇరికించారని సాహిల్ చెబుతున్నాడు. తన పేరు చెప్పేలా తన ఇంటి పనిమనిషి అయిన ఆసిఫ్ పై ఒత్తిడి చేశారని ఆరోపిస్తున్నాడు. సాహిల్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ నిర్వహించనుంది.

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్... హైదరాబాద్‌ బేగంపేట వద్ద ప్రజాభవన్ బారికేడ్ ను ఢీకొట్టాడనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ సమయంలో కారు నడిపింది తానేనని డ్రైవర్ ఆసిఫ్ పోలీసులకు లొంగిపోయాడు. ఆసిఫ్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో పనిచేసే డ్రైవర్ గా చెబుతున్నారు. అయితే ఈ విషయమై పంజాగుట్ట పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణలో పోలీసులు కీలక సమాచారం సేకరించారని తెలిసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సీసీపుటేజీని పరిశీలిస్తే కీలక విషయాలు వెలుగు చూశాయి.

ప్రజా భవన్ వద్ద బారికేడ్‌ను ఢీకొట్టిన సమయంలో వాహనాన్ని నడిపింది సాహిల్‌గా తేలడంతో పంజాగుట్ట సీఐ దుర్గారావును సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. ఈ కేసులో డ్రైవింగ్ చేసిన వ్యక్తిని మార్చినందుకు కేసు నమోదు చేశారు. సాహిల్ మాత్రం పోలీసులకు చిక్కలేదు. తాజాగా హైకోర్టును సాహిల్ ఆశ్రయించాడు. ఈ కేసులో వ్యక్తులను మార్చిన విషయమై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారని సమాచారం. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత సాహిల్ కన్పించకుండా పోయినట్టుగా పోలీసులు చెబుతున్నారు. సాహిల్ దుబాయ్ పారిపోయారనే అనుమాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News