Four New Covid : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు.. కొత్త వేరియంట్‌పై అప్రమత్తం

Byline :  Veerendra Prasad
Update: 2023-12-20 03:13 GMT

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి మరోసారి ఆందోళన రేపుతోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరగడం, కేరళ రాష్ట్రంలో కొత్త వేరియంట్ వెలుగుచూసిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా కొత్త వేరియంట్‌ కేసులపై అప్రమత్తమైంది. ఈ తరుణంలో తెలంగాణలో కరోనా కేసులు వెలువడ్డాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 402 మందికి కరోనా పరీక్షలు చేయగా JN-1 లక్షణాలతో ఉన్న 4 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. తెలంగాణలో మొత్తం 9 మందికి ఐసోలేషన్‌ చేసి చికిత్స అందిస్తునట్టు వైద్యశాఖ తెలిపింది. అయితే.. ఏ జిల్లాల్లో కొత్త వేరియంట్ రోగులను గుర్తించారన్నది తెలియాల్సి ఉంది.




 


మరోవైపు కరోనా చికిత్సలకు నోడల్‌ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై.. కొవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ సూచించారు.

కొత్త కరోనా వేరియంట్‌లో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి లక్షణాలుగా ఉంటాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రాబోయే పండుగల సీజన్ల దృష్ట్యా ప్రజలంతా జాగ్రతగా ఉండాలని, మాస్కులను ధరించాలని ప్రజలను కోరుతున్నారు.ఇక, దేశంలో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. కోవిడ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది.. దేశంలో ఇప్పటివరకు కరోనా కొత్త వేరియంట్‌ బారిన పడి ఆరుగురు మృతి చెందారు




Tags:    

Similar News