తెలంగాణలో మరో మూడు రోజులు వానలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ..

Update: 2023-08-19 12:15 GMT

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం నుంచి జోరు వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇంతకుముందు 18, 19 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలుపగా.. ఇప్పుడు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇవాళ, రేపు హైదరాబాద్ సహా పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

కాగా జులైలో గట్టిగా కొట్టిన వానలు.. అగస్ట్లో అడ్రస్ లేకుండా పోయాయి. గత నెలలో పడిన వర్షాలకు ప్రాజెక్టులు సహా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల గ్రామాలే నీటమునిగి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నెలలో వర్షాలు సరిగ్గా లేకపోవడంతో అటు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.


Tags:    

Similar News