ఎన్నికల కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహన సోదాలు చేస్తున్నారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల లెక్కకు రాని లక్షలాది రూపాయలు పట్టుపడుతున్నాయి. కాగా, శనివారం ఒక్కరోజే దాదాపు రూ. కోటి 23 లక్షలకు పైగా పోలీసులు పట్టుకున్నారు. అంతే కాకుండా 18 తులాల బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
హవాలా ద్వారా అక్రమంగా డబ్బులు తరలిస్తున్న రాజస్థాన్ ప్రాంతానికి చెందిన అనే సవాయి శర్మ(42) వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.18 లక్షలు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. హవాలా ఏజెంట్ అయిన సవాయి శర్మ.. కేరళకు చెందిన మనీష్ అనే వ్యక్తి సూచనల మేరకు బేగంబజార్, ఇతర మార్కెట్లలోని వ్యాపారులతో ఆ డబ్బుని కలెక్ట్ చేసి హవాలా ట్రాన్జాక్షన్ చేసేందుకు సిద్ధమవగా.. పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, అతడి వద్దనున్న డబ్బును సీజ్ చేశారు.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. నాలుగు రోజుల్లో వ్యవధిలో రూ.54 లక్షలకు పై చిలుకు నగదు, 18 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని హిమాయత్ నగర్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.49 లక్షల 97వేల నగదును నారాయణ గూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెహిదీపట్నానికి చెందిన మహ్మద్ అతీక్ అహ్మద్, బంజారాహిల్స్కు చెందిన కాజిల్ మాలిక్ అనే ఇద్దరు వ్యక్తులు డబ్బు తీసుకొని హోండా యాక్టివాపై వెళ్లుతుండగా.. హిమాయత్నగర్లోని ఇండియన్ బ్యాంక్ సమీపంలో నారాయణగూడ పోలీసులు పట్టుకున్నారు. సరైన పత్రాలు, ఆధారాలు చూపక పోవడంతో రూ.49 లక్షల 97వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.