ప్రియురాలి ఇంటికెళ్లి.. పేరెంట్స్‌కి చిక్కిన యువకుడు.. చావబాదారు

Update: 2023-11-10 07:34 GMT

హైదరాబాద్ శివారులో మరో పరువు హత్య జరిగింది. మరో కులానికి చెందిన యువకుడు తమ అమ్మాయిని ప్రేమించాడాని యువకుడిని నగ్నంగా చేసి, చితకబాది చంపారు. మరో సామాజిక వర్గానికి చెందిన యువకుడు తమ కూతురును ప్రేమించాడని కక్ష పెంచుకున్న బాలిక కుటుంబ సభ్యులు... ఎన్నిసార్లు చెప్పినా యువకుడు తీరు మార్చుకోవడం లేదని దారుణంగా కొట్టి చంపారు. పోచారం ఐటీ కారిడార్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఘట్‌కేసర్‌ సమీపంలోని అన్నోజిగూడ శ్రీలక్ష్మీనరసింహ కాలనీకి చెందిన కరణ్‌నాయక్‌(18) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తండ్రి మరణించగా తల్లి యాదిబాయ్‌తో కలిసి నివసిస్తున్నాడు . అదే కాలనీలో ఉంటున్న బాలిక(15)తో కరణ్‌కు పరిచమైంది. వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. ఇద్దరూ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు కరణ్‌ను చాలాసార్లు హెచ్చరించారు. అయితే ఎన్ని సార్లు చెప్పినా వినకుండా బాలికను మళ్లీ మళ్లీ కలుస్తున్నాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు.

బుధవారం నాడు బాలిక తల్లిదండ్రులు ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. బాలిక ఒంటరిగా ఇంట్లోనే ఉండిపోయింది. కరణ్ అర్ధరాత్రి బాలిక ఇంటికెళ్లాడు. బాలిక కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న కొందరు తెలిపారు. ఫంక్షన్‌ నుంచి వెంటనే తిరిగివచ్చారు. కరణ్‌ తప్పించుకోకుండా ముందుగా బయట నుంచి గడియపెట్టారు. తమ బంధువులను కొందరిని పిలిపించుకుని ఇంట్లోకి ప్రవేశించారు. యువకుడిని చితకబాదారు. బట్టలన్నీ విప్పి నగ్నంగా చేసి తాళ్లతో కట్టేశారు. అతడి మర్మాంగాలపై కారం చల్లుతూ.. కర్రలతో దాడి చేస్తూ గంటపాటు చిత్రహింసలు పెట్టారు. యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లి కొద్దిసేపటికే మరణించాడు. సమాచారం తెలుసుకున్న ఇన్‌ఛార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ నాగార్జున్‌రెడ్డి.. సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు. బాలిక తల్లిదండ్రులు సహా 9 మందిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అన్నోజిగూడ పరిసర ప్రాంతాల్లో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. 




Tags:    

Similar News