CM Revath reddy : ఇందిరమ్మ ఇండ్ల పధకంపై.. తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన

Byline :  Vamshi
Update: 2024-03-06 13:13 GMT

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయిస్తామని చెప్పారు. సొంత స్ధలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇస్తామని, కనీసం 400 చదరపు అడుగుల ఇల్లు నిర్మించాలని పేర్కొన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు, రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీలలో ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమలు చేస్తుండగా ఈ నెల 11న భద్రాచలం రాములోరి సన్నిధిలో ఐదవ గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.




 


నిరుపేదలకు నిలువ నీడను కల్పించడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యమని, కానీ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలిన గత పాలకులు ఈ కర్తవ్యాన్ని విస్మరించారని ఆయన అన్నారు. ప్రజల అవసరాలను ఆశలను గత ప్రభుత్వం వారి రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుందని విమర్శించారు. కానీ మా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సహాయం అందించడానికి అవసరమైన కార్యచరణను ప్రారంభించిందన్నారు. బుధవారం సచివాలయంలో హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి చర్చించారు.పేదవారి సొంతింటి కల ముఖ్యమంత్రి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇప్పుడు సాకారం కాబోతున్నదని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.




 





Tags:    

Similar News