కాళేశ్వరం ప్రాజెక్ట్ సురక్షితం కాదు...Sridhar Babu

Byline :  Vinitha
Update: 2024-03-02 12:58 GMT

తెలంగాణ ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాళేశ్వరం ప్రాజెక్టు సురక్షితం కాదని తాము మాత్రమే కాదని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా చెబుతున్నారని అన్నారు. ఈ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా మంథనిలో గృహజ్యోతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పెద్దపల్లి, భూపాలపల్లి ప్రాంతాల్లో ఒక్క చుక్క నీరు కూడా అందలేదని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా మేడిగడ్డను సందర్శించినందుకు సంతోషం అన్నారు. ఈ ప్రాజెక్టు కరెక్ట్ కాదని నిపుణులు చెబుతున్నారని అన్నారు.

నిపుణుల సలహాల మేరకు మేడిగడ్డకు మరమ్మతులు జరుగుతాయని అన్నారు. అంతేగాని వాళ్లు అన్నారనో..వీళ్లన్నారనో రిపేర్లు చేస్తే ప్రాజెక్ట్ మళ్లీ కుంగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజినీర్లు, నిపుణుల సూచనల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వెయిట్ చేస్తోందని అన్నారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాకముందే..ఆరు గ్యారెంటీల్లో పలు హామీలను అమలు చేశామని చెప్పారు. ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో హామీల అమలు బీఆర్ఎస్ నేతల కళ్లకు కనిపించడం లేద అని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.

Tags:    

Similar News