Telangana TDP: అభ్యర్థులు సిద్ధం.. తెలంగాణలో పోటీ చేయబోతున్నాం.. కాసాని జ్ఞానేశ్వర్

Update: 2023-10-16 09:17 GMT

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని.. టీడీపీ కంటే కాంగ్రెస్ బలంగా ఉందనే మాట అపోహ మాత్రమే అని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాసాని మాట్లాడారు. ఈ సందర్భంగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 87 స్థానాల్లో అభ్యర్థులను సిద్ధం చేసినట్లు చెప్పారు. రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిశానని.. పొత్తుల విషయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

ఇక జనసేనతో ముందుకెళ్లాలా? లేదా? అనేది త్వరలోనే తెలుస్తుందని చెప్పారు కాసాని. తమ పార్టీ మేనిఫెస్టోలో పేద, బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట ఉంటుందన్నారు. ప్రజలు, యువతకు మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో తమ పార్టీ నేతలు ప్రచారంలో ఉన్నారని చెప్పారు. సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేస్తారని తెలిపారు.

చంద్రబాబు నాయుడుతో శనివారం ములాఖత్‌ అయ్యామని, తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఆయనకు వివరించామని కాసాని చెప్పారు. 87 స్థానాల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని... చంద్రబాబు ఆమోదించాక పేర్లు ప్రకటన ఉంటుందన్నారు. మంగళవారం చంద్రబాబు బయటకు వస్తారని తాము ఆశిస్తున్నామన్నారు. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. వాటిని మేం ఖండిస్తున్నామని అన్నారు.

Tags:    

Similar News