ఎన్టీఆర్ లాంటి నేతకే రాజకీయాల్లో ఒడిదుదుకులు తప్పలేదన్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. జిల్లాలో పార్టీ ఓడిపోయినా నేతలు ధైర్యంగా ముందుకు వెళ్ళాలని సూచించారు. పార్టీ వీడి వెళ్లే నేతలతో బీఆర్ఎస్ పార్టీకి నష్టం లేదపి స్పష్టం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు సమన్వయకర్తలను నియమిస్తామని అన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు.
ఎన్టీఆర్ లాంటి వాళ్ళకే ఒడిదుడుకులు తప్పలేదు...మనమెంతా మనకు ఇబ్బందులు వస్తాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చెప్పారు. కాంగ్రెస్ వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ సద్వినియోగం చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. రాబోయే రోజులు మనవే, ప్రభుత్వం పై వ్యతిరేకత స్టార్ట్ అయిందని కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఈనెల 12న కరీంనగర్ నుండి ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో 8 నుండీ 9 స్థానాలు బీఆర్ఎస్ వేనని ధీమా వ్యక్తం చేశారు. ఓడిన ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పట్లో అమలు అయ్యేలా లేవని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కేసీఆర్ అన్నారు.