టీబీజేపీ చీఫ్‌గా కిషన్, కేంద్రానికి బండి, ఎన్నికలకు ఈటల!

Update: 2023-07-03 13:12 GMT

తెలంగాణ బీజేపీ నాయకత్వంలో సమూల మార్పులు చేయాలని అధిష్టానం నిర్ణయించింది. కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలను కాస్త అటూ ఇటుగా ఖాయం చేస్తూ త్రికుల వ్యూహాన్ని అమలు చేయనుంది. ఢిల్లీలో సోమవారం ఢిల్లీలో మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కావడం, రాష్ట్ర పార్టీ నేతలు పదవులపై ఆకాంక్షలు, అసంతృప్తులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కమల నేథులు పరిస్థితి చేయిదాటకముందే మార్పుచేర్పులపై ఒక నిర్ణయానికి వచ్చారు. పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం...

కిషన్ రెడ్డే దారికి తెస్తారు..

త్వరలోనే ఎన్నికలు ఉండడంతో రాష్ట్ర కమిటీని బలోపేతం చేయాలన అధిష్టానం సంకల్పించింది. సాధ్యమైనంతవరకు ఎవరినీ నొప్పించకుండా, కుల సమీకరణాలను లెక్కలోకి తీసుకుని పదవులు పంచునున్నారు. మున్నూరు కాపు వర్గానికి చెందిన టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌కి కేంద్ర సహాయమంత్రి పదవి దక్కనుంది. కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డికి తిరిగి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టనున్నారు. అంతర్గత విభేదాలను ఆయనైతేనే పరిష్కరించి నేతలను ఒక తాటిపైకి తెస్తారని అధిష్టానం భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో ఈ పదవి చేపట్టడానికి కిషన్ సుముఖంగా లేకపోయినా తప్పని పరిస్థితిలో పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి తిరిగి రానున్నారు.

ఈటల ఇటీవలే పార్టీలోకి వచ్చినా ఆయనకు ఉన్న మాస్ ఫాలోయింగ్‌ను ఓట్ల రూపంలోకి మార్చుకోవడానికి ఎన్నికల కమిటీ సారథ్యాన్ని అప్పగించనున్నారు. తనను సైనికుడిలా పనిచేస్తానని, శ్రేణులకు అండగా ఉంటానని ఈటల ట్వీట్ చేయడం తెలిసిందే. ఎన్నికల తతంగాలపై సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు టికెట్ల కేటాయింపు, బుజ్జగింపు, ప్రచార వ్యూహం తదితర కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ పదవిపై ఢిల్లీ నాయకులకు నుంచి స్పష్టమైన సమాచారం రావడంతోనే ‘సైనికుడిలా’ పనిచేస్తానని ముదిరాజ్ నాయకుడు ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

మూడు కూలాలకు..

కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటలకు అధిష్టానం మూడు కీలక పదవులు పంచిపెట్టి ‘త్రికుల’ సమానత్వాన్ని పాటించినట్లు కనిపిస్తోంది. కీలక పదవుల్లో ఏదో ఒకటి తనకు దక్కుతుందని ఆయన పెట్టుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్ రావుకు అధిష్టానం నిర్ణయం అర్థమయ్యే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ నుంచి వెళ్లిపోనని అంటున్న ఆయనను నేతలు ఎలా బుజ్జగిస్తారో చూడాలి. వెలమ సామాజిక వర్గానికి చెందిన తనకు తన కులమే శాపమైందని ఆయన వాపోతున్నారు. ముఖ్యమైన పదవులు దక్కని కొండా విశ్వేశర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి వంటి అగ్ర, బీసీ, దళిత బీజేపీ నేతలు సణుక్కుంటూనే సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంపీ, ఎమ్మెల్యేల టికెట్ల పంపిణీలో ఇలాంటి వారికి ప్రాధాన్యంతోపాటు చిన్నాచితకా పోస్టులు దక్కొచ్చు. నచ్చని వాళ్లు ఎప్పట్లాగే వేరే పార్టీలపై మొగ్గు చూపే అవకాశాలు ఇప్పటికే పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News