ఈ నెల 30న కాంగ్రెస్‌లోకి కేకే, విజయలక్ష్మి!

Byline :  Vamshi
Update: 2024-03-28 11:09 GMT

లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. రాజ్య సభ ఎంపీ పార్టీ జనరల్ సెక్రటరీ కంచెర్ల కేశవ రావు ఆ పార్టీని విడబోతున్నారు. ఈ విషయం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చెప్పేందుకు ఆయన కేసీఆర్ నివాసానికి వెళ్లినట్లు సమాచారం. కాగా ఇటీవలే ఏఐసీసీ ఇన్ఛార్జీ దీపా దాస్ మున్షీ, కేశవరావు, ఆయన కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వాంచిన సంగతి తెలిసిందే. కేకే కాంగ్రెస్‌లో చేరే తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది.

ఆయన ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాసేపటి క్రితమే కేకే ఎర్రవల్లిలోని ఫామ్‌హోస్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. పార్టీ మారేందుకు ఆయన అనుమతి తీసుకునేందుకు కేకే వెళ్లినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సమక్షంలో గద్వాల విజయలక్ష్మి 15 మంది కార్పొరేటర్లతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తం గూటికి చేరారు. ఆయన కాంగ్రెస్ తరఫున లోక్ సభ అభ్యర్థిగా ఫిక్స్ అయిపోయారు కూడా. అలాగే మాజీ మేయర్, గ్రేటర్ పరిధిలో గట్టి పట్టున్న బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ పంచన చేరారు. ఇప్పుడు తాజాగా మేయర్ విజయలక్ష్మి సైతం కారు దిగిపోయి చేయందుకోవడానికి రెడీ అయిపోయారు. 

Tags:    

Similar News