సంక్షోభాలకు కారణమైన కాళేశ్వరం ప్రాజెక్ట్.. కామధేను ఎలా అవుతుంది: కోదండరాం

Byline :  Bharath
Update: 2024-03-01 10:34 GMT

బీఆర్ఎస్ పార్టీపై టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ వైఖరి దొంగే దొంగ అన్నట్లు ఉందని విమర్శించారు. నాంపల్లిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతి, కాగ్ నివేదిక అంశాలపై చర్చించారు. కాళేశ్వరం ముంపు ప్రాంతాల్లో తాము పర్యటించామని.. డిపిఆర్ ఓకే అని చెప్పకముందే పనులు ప్రారంభించారని కోదండరాం ఆరోపించారు. ఎన్నోసార్లు ప్రాజెక్టు అంచనాలు పెంచేశారన్నారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పటిష్టంగా ఉందని బీఆర్ఎస్ నేతలు అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మూడు పిల్లర్లు మాత్రమే కుంగాయని బీఆస్ఎస్ వితండవాదం చేస్తుందని ధ్వజమెత్తారు.

కాళేశ్వరంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని కోదండరాం గుర్తు చేశారు. పంప్ హౌస్‌లో మోటర్లు మునిగిపోయాయని మండిపడ్డారు. ఈ ఒక్క ప్రాజెక్ట్ విషయంలో ప్రతి ఏటా రూ.20 వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడిందన్నారు. కుంగింది మూడు పిల్లర్లు కాదు.. మూడు కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తు అన్నారు. మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విమర్శలున్నాయని.. మేడిగడ్డ బ్యారేజీలు ఎందుకు కుంగాయో బీఆర్ఎస్ నేతలు చెప్పాలన్నారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం మల్లన్న సాగర్ కట్టినా.. అందులో నీళ్లు నింపే పరిస్థితి లేదని తెలిపారు. భూకంపాలు వచ్చే నేలలో మల్లన్న సాగర్ కట్టారని.. ఏం చెప్పేందుకు బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ బయలుదేరారని ఫైర్ అయ్యారు.

ఈ సందర్భంగా.. కాళేశ్వరం ప్రాజెక్టులపై జరిగిన తప్పిదాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. మిలియన్ మార్చ్ స్పూర్తితో మార్చి 10న చర్చకు రావాలని డిమాండ్ చేశారు. మూడు రకాల సంక్షోభాలకు కారణమైన కాళేశ్వరం ప్రాజెక్ట్.. కామధేను ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలని కోరారు. తన ప్రభుత్వం ప్రయోజనాల కోసం కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ చేపట్టారని ఆరోపించారు.



Kodandaram on Kaleshwaram project,Kodandaram on medigadda,Kodandaram press meet in nampalli,Kodandaram on kcr,Kodandaram on brs,Kodandaram on chalo medigadda,telangana,congress,medigadda annaram bariage

Tags:    

Similar News