KTR Tweet: 'ప్రధాని గారు.. మా మూడు ప్రధాన హామీల సంగతేంటి...???'..

Update: 2023-10-03 06:36 GMT

హైదరాబాద్ : మా మూడు ప్రధాన హామీల సంగతేంటంటూ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రధాని మోదీని ప్రశ్నించారు. మూడురోజుల వ్యవధిలో తెలంగాణకు రెండోసారి వస్తున్నరని.. మరి ఆ మూడు విభజన హక్కులకు దిక్కేదని నిలదీశారు.

1. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు ?

2. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు ?

3. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు ? అంటూ ప్రశ్నించారు. పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర, మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు.. గుండెల్లో గుజరాత్‌ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా అంటూ విమర్శించారు.

కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఉపిరి తీశారని, లక్షల ఉద్యోగాలిచ్చే ఐటీఐఆర్‌ను ఆగం చేశారని విమర్శించారు. మా ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని తుంగలో తొక్కారని, దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహంచేసి వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ పదేండ్ల పాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజలనే కాదు.. 140 కోట్ల భారతీయులను మోసం చేశారన్నారు.

2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ అన్నారు, దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పారు. పెట్రోల్ ధరలు నియంత్రిస్తామన్నారు, మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాటను నెరవేర్చరా అని ప్రశ్నించారు. మీ పసుపు బోర్డు ప్రకటన కూడా మహిళా రిజర్వేషన్ మాదిరిగానే ఉందన్నారు. ఎన్నికల వేళ ఇప్పుడు హంగామా చేస్తున్నారని, మరి అది అమలు అయ్యేది ఎప్పుడోనని ఎద్దేవా చేశారు. ప్రధానిగా మీ పదేండ్ల పాలనలో అదానికి తప్ప.. ఆమ్ ఆద్మీకి దక్కిందేంటని ప్రశ్నించారు. మా మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా అని, మళ్లీ వంద స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ అన్నారు.

Tags:    

Similar News