పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కే ఎందుకు ఓటేయ్యాలంటే..? : KTR

Byline :  Krishna
Update: 2024-01-17 09:23 GMT

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వరుస సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటెయ్యాలో వివరించారు. తెలంగాణ గళాన్ని పార్లమెంట్లో గట్టిగా వినిపించేది బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పారు. లోక్ సభలో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఎన్ని సార్లు వివరించారో లెక్కలతో సహా చెప్పారు.

16,17 లోక్ సభ సమావేశాల్లో ఏ ఏ పార్టీలు కేంద్రానికి ఎన్ని ప్రశ్నలు సంధించారో గణాంకాలు విడుదలయ్యాయి. ఈ లెక్కల ప్రకారం బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని 4,754 సార్లు ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ 1271, బీజేపీ 190 సార్లు మాత్రమే ప్రశ్నించారు. ‘‘2014లో రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక టీఆర్ఎస్. 2024లో కూడా తెలంగాణకున్న ఏకైక గొంతుక మన పార్టీ మాత్రమే. నాడు, నేడు.. ఏనాడైనా..తెలంగాణ గళం.. తెలంగాణ బలం..తెలంగాణ దళం..మనమే’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా 2019లో బీఆర్ఎస్కు 9మంది ఎంపీలు ఉండగా.. కాంగ్రెస్కు ముగ్గురు, బీజేపీకి నలుగురు సభ్యులు ఉన్నారు.

Tags:    

Similar News