'సీఎం కేసీఆర్‌కు పోటీగా 1016 నామినేషన్లు'.. ఆ ఒక్క నియోజక వర్గంలో!!!

Byline :  Veerendra Prasad
Update: 2023-09-06 06:05 GMT

రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పోటీచేయనున్న నియోజకవర్గంలో.. ముఖ్యమంత్రికి పోటీగా 1016 నామినేషన్లు వేస్తామని హెచ్చరిస్తున్నారు లబాణా లంబాడీల నాయకులు. తమను ఎస్టీ జాబితాలో చేర్చకపోతే ప్రభుత్వంపై యుద్ధానికే సిద్ధమవుతామని ఆ వర్గం రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తాన్ సింగ్ మాట్లాడుతూ.. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే కామారెడ్డి నియోజకవర్గంతో పాటు తమ ప్రాంతాలైన 9 నియోజకవర్గాల్లో నామినేషన్లు వేస్తామని చెప్పారు. ఒక్కొక్క నియజకవర్గంలో 116 చొప్పున.. కామారెడ్డి నియోజకవర్గంలో మాత్రం 1016 నామినేషన్లు వేస్తామని వెల్లడించారు.




 


తామేమీ బిచ్చం అడుక్కోవడం లేదని.. తమ హక్కులను అడుగుతున్నామని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెల్లప్ప కమిషన్ కు విలువ లేదా అని ప్రశ్నించారు. ఉద్యమ నాయకునిగా తమ సమస్యలు కేసీఆర్ కు తెలియవా అని నిలదీశారు. తమ డిమాండ్ ల పరిష్కారం కోసం త్వరలో కామారెడ్డిలో 25 వేల మందితో ఏక్తా ర్యాలీ నిర్వహిస్తామని, కలెక్టర్ ను నిర్బంధిస్తామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రాణాలకైనా తెగించి హక్కులను సాధించుకుంటామని తేల్చి చెప్పారు. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే తమను కలుపుకుని 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీఓ 2,4,5 అమలు చేయాలని కోరారు. పోడు భూముల పట్టాలు ఇవ్వాలని, లబాణా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.




Tags:    

Similar News