మహబూబాబాద్‌ ఎస్పీ సడెన్ ట్రాన్స్‌ఫర్.. కారణం అదేనా?

Byline :  Veerendra Prasad
Update: 2023-08-29 05:49 GMT

మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న శరత్‌చంద్ర పవార్‌ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఆయన్ను తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీచేస్తూ సీఎస్‌ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సాధారణ బదిలీలు లేకపోయినా జిల్లా ఎస్పీని మాత్రం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫర్‌ చేయడం వెనుక రాజకీయ కోణాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఓ ఎమ్మెల్యేకు అల్లుడు కావడంతోనే శరత్‌చంద్ర పవార్‌కు ఆకస్మాత్తుగా బదిలీ జరిగిందని చెబుతున్నారు

2021, డిసెంబరు 26న శరత్‌చంద్ర పవార్‌ మహబూబాబాద్‌ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన స్థానంలో డీజీపీ కార్యాలయంలో మల్టీ ఏజెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ - కమాండ్‌ కంట్రోల్‌ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న గుండేటి చంద్రమోహన్‌ను నియమించారు. అయితే శరత్‌చంద్ర పవార్‌ బదిలీకి కారణం.. ఖానాపూర్‌ ప్రస్తుత ఎమ్మెల్యే, ఆయన అత్తగారైన రేఖానాయక్‌ కారణమని అంటున్నారు. రేఖా నాయక్ అల్లుడు కావడంతోనే.. శరత్‌చంద్రను జిల్లా బాధ్యతల నుంచి తప్పిచి ఉంటారని ప్రచారం జరుగుతోంది.

బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో రేఖానాయక్‌ పేరు గల్లంతైంది. దీంతో ఆమె కాంగ్రెస్‌ పార్టీలో టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఎన్నికల వరకు ఖానాపూర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ను బదిలీ చేసి ఉండొచ్చని చెబుతున్నారు.

Tags:    

Similar News