Modi : జనసంద్రంగా మేడారం..మోడీ ఏం అన్నారంటే

Byline :  Shabarish
Update: 2024-02-21 05:33 GMT

తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఈ తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ప్రధాని ట్వీట్ చేశారు. గిరిజనుల అతి పెద్ద పండగలలో మేడారం జాతర ఒకటని, ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తి కలగలిపి వస్తుందన్నారు.

అందరం సమ్మక్క, సారలమ్మకు ప్రణమిల్లుదామని, వారి ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని మోడీ అన్నారు. సాంస్కృతిక వారసత్వానికి, చిరకాల స్ఫూర్తిగా నిలిచే సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు అంటూ మోడీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తెలంగాణలో అతి పెద్ద మహా కుంభమేళాగా భావించే మేడారం మహాజాతర రెండేళ్లకు ఒకసారి వస్తుంది. నేడు జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే లక్షలాది మంది భక్తులు మేడారానికి చేరుకున్నారు. ఇంకా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూనే ఉన్నారు. మరో నాలుగు రోజుల్లో కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా మేడారానికి తరలి వస్తున్నారు.

Tags:    

Similar News