మేడారం మహాజాతర సరికొత్త రికార్డ్

Byline :  Shabarish
Update: 2024-02-24 15:11 GMT

తెలంగాణలో మేడారం మహాజాతర ముగిసింది. అంగరంగ వైభవంగా మేడారం జాతర సాగింది. ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారంగా పూజారులు మేడారంలో పూజలు నిర్వహించారు. గద్దెల వద్ద పూజలు చేశాక వన ప్రవేశం చేశారు. చిలుకలగుట్టకు సమ్మక్క, కన్నేపల్లికి సారలమ్మను సాగనంపారు. వనప్రవేశం సందర్భంగా మూడంచెల రోప్ పార్టీతో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. డోలి వాయిద్యాలు, ఆదివాసి ఆచార సాంప్రదాయాలతో వన ప్రవేశం కార్యక్రమం ముగిసింది. ఈసారి మేడారం జాతర సరికొత్త రికార్డును నెలకొల్పింది.

జాతరకు ముందుగా నెల రోజుల్లోనే 55 లక్షల మంది మేడారంలో దర్శనం చేసుకున్నారు. ఇకపోతే నాలుగు రోజులు జరిగిన జాతరలో కోటీ 30 లక్షల మంది భక్తులు సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. శని, ఆదివారాలు కలిపితే మరో 10 లక్షల మంది అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉంది. జాతర ముగిసిన సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. జాతరకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

నాలుగు రోజుల జాతరలో సమ్మక్క సారక్క దేవతలకు భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిలి సై సౌందర్ రాజన్, స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అర్జున్ ముండాతో పాటు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, విప్ రాంచంద్రనాయక్ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది భక్తులు విచ్చేశారు. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణం ప్రభావంతో ఈసారి భక్తుల సంఖ్య భారీగా పెరిగిందని, 6 వేల బస్సులు నడిపినట్లు ఆర్టీసీ అధికారికంగా వెల్లడించింది.


Tags:    

Similar News