ఎంజీఎంలో కరోనా వార్డు.. పరిస్థితి అంత దారుణమా..?

Byline :  Bharath
Update: 2023-12-20 10:50 GMT

దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కేరళలో కొత్త సబ్ వేరియంట్ వెలుగు చూసిన దృష్ట్యా కేంద్ర అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కరోనా టైంలో తీసుకున్న జాగ్రత్తలను మరోసారి పాటించాలని.. అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూ ఇటీవల అడ్వైజరీ జారీ చేసింది. కరోనా టెస్టుల కోసం ఆర్టీపీసీఆర్ కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలనని, టెస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించింది. జిల్లాల్లోని కేసులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలి కోరింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను INSACOG ప్రయోగశాలలకు పంపాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కాగా, ఇటీవల కరోనా సబ్ వేరియంట్ JN.1 కేరళలో బయటపడిన విషయం తెలిసిందే. రానున్న పండగల సీజన్‌లో వైరస్‌ కట్టడి చర్యలను ముమ్మరంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా కొత్త వేరియంట్‌ కేసులపై అప్రమత్తమైంది. ఈ తరుణంలో తెలంగాణలో కరోనా కేసులు వెలువడ్డాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 402 మందికి కరోనా పరీక్షలు చేయగా JN-1 లక్షణాలతో ఉన్న 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం 9 మందికి ఐసోలేషన్‌ చేసి చికిత్స అందిస్తునట్టు వైద్యశాఖ తెలిపింది. అయితే.. ఏ జిల్లాల్లో కొత్త వేరియంట్ రోగులను గుర్తించారన్నది తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్ లో కరోనా వార్డు ఏర్పాటుచేశారు. ఎంజీఎం ఆసుపత్రిలో గుండె చికిత్స విభాగాన్ని.. కరోనా వార్డుగా మార్చారు. మొత్తం 50 పడకలతో పూర్తిస్థాయి కరోనా వార్డు ఏర్పాటుచేశారు. వార్డులో బెడ్స్ తో పాటు.. ఆక్సిజన్, వెంటిలేటర్ ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీంతో పరిస్థితిపై సామాన్యుల్లో ఆందోళన మొదలైంది. చాలామంది కరోనా టైంలో తీసుకున్న జాగ్రత్తలను పాటిస్తున్నారు. మాస్కులు ధరించి బయట తిరుగుతున్నారు.

Tags:    

Similar News