మరో మూడ్రోజులు వర్షాలు.. ఎల్లో అలర్డ్ జారీ

Update: 2023-08-15 03:14 GMT

అయితే కుంభవృష్టి.. లేదంటే అక్కడక్కడ చినుకులు.. అన్నట్లుగా ఉంది తెలంగాణలో వాతావరణ పరిస్థితి. గత 15 రోజులు సరిగ్గా వర్షాలు కురవటం లేదు. జులై చివరి వారంలో దంచికొట్టిన వానలు ఆగస్టులో అడ్రస్ లేవ్. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మెుక్కలు పెరిగే దశలో ఉంటాయి కాబట్టి వర్షం అవసరం రైతులకు ఎంతో ఉంది. అయితే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురవటం లేదని రైతులు కంగారు పడుతున్న ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలపై భారత వాతావరణ హైదరబాద్ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడ్రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

ఏపీ తీరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. బంగ్లాదేశ్, మయన్మార్ దగ్గర ఉన్న మేఘాలను తనవైపు తిప్పుకుంటోంది. అవి ఏపీ, తెలంగాణపై ఆవరించి ఉన్నాయి. నేటి నుంచి వరుసగా మూడురోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. హైదరాబాద్, మల్కాజ్‌గిరి, యాదాద్రి- భువనగిరి, సిద్ధిపేట, నల్గొండ, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ ఆవర్తనం కారణంగా ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.

ఇక సోమవారం సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్‌, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుసాయి. సాయంత్రం హైదరాబాద్‌లోనూ వర్షం కురిసింది. ఉన్నట్లుండి వాతావరణం మేఘావృతమై.. ఎల్బీనగర్, వనస్థలిపురం, చైతన్యపురి, నాగోల్, హయత్ నగర్, మలక్ పేట్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. నగరంలో ఇవాళ ఉదయం కూడా వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.



Tags:    

Similar News