తెలంగాణలో ఇకపై ఉచితంగా 134 వైద్య పరీక్షలు : హరీష్ రావు

Update: 2023-07-01 09:21 GMT

తెలంగాణలో 134 ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. టీ-డయాగ్నొస్టిక్స్‌లో అందించే ఈ వైద్య పరీక్షలను మంత్రి హరీశ్‌రావు కొండాపూర్ ఆస్పత్రి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. 31 జిల్లాల్లో టీ-డయాగ్నొస్టిక్స్‌ కేంద్రాలు, రేడియాలజీ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. మరో రెండు జిల్లాల్లో పనులు జరుగుతున్నాయని, త్వరలోనే వాటిని కూడా పూర్తిచేస్తామన్నారు.

‘‘తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ ద్వారా ఇప్పటివరకు 54 పరిక్షలు ఉచితంగా చేశాం. మరో 134 వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చాం. పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను రోగి, వైద్యుల మొబైల్‌కు పంపిస్తాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టిఫా స్కాన్‌, 2డి-ఎకో రేడియాలజీ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాం. అన్ని పీహెచ్‌సీల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తాం. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం లేదు’’ అని హరీష్ రావు తెలిపారు.

కరోనా సమయంలో వైద్యులు ప్రాణాలకు తెగించి పనిచేశారని హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో వైద్యుల పనితీరు అద్భుతంగా ఉందన్నారు. వైద్యారోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచేలా కృషిచేసిన డాక్టర్లందరికీ.. వరల్డ్‌ డాక్టర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్‌ స్థాయి ఆస్పత్రులకు ధీటుగా మార్చమన్నారు. ప్రభుత్వం మహిళలకు కేసీఆర్‌ కిట్, న్యూట్రిషియన్ కిట్ అందిస్తోందని చెప్పారు. గతంలో ప్రభుత్వాస్పత్రుల్లో 30శాతం ప్రసవాలు జరిగితే.. ఇప్పుడు 70శాతం అవుతున్నాయని అన్నారు.




 


Tags:    

Similar News