Minister Komati Reddy:మచ్చలేని నాయకుడు పీవీ నరసింహారావు.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Update: 2024-02-09 11:11 GMT

భారత మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహా రావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించడంపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మచ్చలేని నాయకుడు పీవీ నరసింహారావు అని కొనియాడారు. రాజకీయాల్లో ఆయన మార్గదర్శకుడు అని అభిప్రాయపడ్డారు. పీవీ నరసింహా రావును ప్రధాని మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తుచేశారు. దేశానికి ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వస్తే వదులుకొని.. పీవీ నరసింహారావుకు సోనియా గాంధీ ఛాన్స్ ఇచ్చారని తెలిపారు. జనతా పార్టీ దేశాన్ని ముక్కలు చేసిందని గుర్తుచేశారు. పీవీ సంస్కరణలు అమలు చేసి దేశాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించారని అన్నారు.

పీవీకి భారత రత్న దక్కడం పట్ల మరో కాంగ్రెస్ నేత, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హర్షం వ్యక్తం చేశారు. కుప్పకూల బోతున్న భారత్ ఆర్థిక వ్యవస్థను తన ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ ద్వారా ప్రపంచంలోనే ఆర్థికంగా బలమైన దేశంగా భారత్ ను రూపొందించడంలో స్వర్గీయ పీవీ నరసింహారావు తన చివరి శ్వాస వరకు శ్రమించారని కొనియాడారు. ఆయన చేసిన ఆర్థిక సంస్కరల పునాదుల ఫలితంగానే ఇవాళ భారత్ దేశం ప్రపంచంలోనే ఆర్థికంగా నాలుగవ బలమైన దేశంగా రూపుదిద్దుకుందన్నారు. గొప్ప రాజనీతిజ్ణుడు, బహుభాషా కోవిదుదు తెలంగాణ రాష్టానికి చెందిన పీవీకి భారత రత్న దక్కడం .. కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా భావిస్తున్నామన్నారు.

కాగా, పీవీ నరసింహా రావు పూర్తి పేరు పాములపర్తి వేంకట నరసింహారావు. భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశాడు. ఈయన బహుభాషావేత్త, రచయిత కూడా. ఈ పదవిని అధిష్టించిన మొదటి దక్షిణ భారత దేశానికి చెందిన వ్యక్తి.. ఒకే ఒక్క తెలుగువాడు. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి. అదే సమయంలో దేశభద్రతకు సంబంధించిన బాబ్రీ మసీదు కూల్చివేత లాంటి కొన్ని సంఘటనలకు కూడా ఆయన సాక్షిగా ఉన్నాడు. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పీవీ రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేశారు.

Tags:    

Similar News