త్యాగధనులను ఎప్పుడూ మా గుండెల్లో పెట్టుకుంటాం.. మంత్రి కేటీఆర్

Update: 2023-06-22 05:51 GMT

తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. తెలంగాణ సాధనోద్యమం ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రలోనే సమున్నతమని తెలుపుతూ.. ఆశయ సాధనకై వారు చేసిన పోరాటాన్ని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం వారు చేసిన ఉద్యమం.. ప్రజాస్వామిక పోరాటాలకు తలమానికమని అన్నారు. మన అమరుల ఆశయం కేవలం స్వపరిపాలన మాత్రమే కాదని, సుపరిపాలన ఫలాలను సమస్త ప్రజలకు అందించడమని చెప్పారు. దశాబ్దాలుగా పట్టిపీడించిన సకల దరిద్రాలను శాశ్వతంగా దూరంచేసి.. తెలంగాణ సమాజాన్ని కష్టాల కడలి నుంచి గట్టెక్కించడమన్నారు.

అమరుల ఆశయాలే స్ఫూర్తిగా, ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలే ఊపిరిగా, తెలంగాణ ఉద్యమ నినాదాలే మైలురాళ్లుగా, దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దే మహాయజ్ఞం మహోద్యమంగా సాగిందనడానికి తొమ్మిదేండ్ల ప్రగతి ప్రస్థానమే నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. భారత స్వాతంత్ర్య పోరాటయోధుల కలలు 75 ఏళ్లు దాటినా నెరవేరలదని, కానీ తొమ్మిదేండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ అమరుల ఆకాంక్షలు నెరవేర్చి, వచ్చే వందేండ్లకు బలమైన పునాది వేసిన సంకల్పమే యావత్ దేశానికి.. తెలంగాణ నేర్పుతున్న పరిపాలనా పాఠమన్నారు.

త్యాగధనులను ఎప్పుడూ మా గుండెల్లో పెట్టుకుంటామని, నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల సేవలో పునరంకితమవుతామని హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరిన అమరుల స్మారకస్థూపం.. జ్వలించే దీపం సాక్షిగా ప్రతిజ్ఞచేస్తున్నామని వెల్లడించారు. లక్ష్యం కోల్పోయిన భారత దేశానికి దారిచూపే ఒక దీపస్తంభంగా తెలంగాణను నిలుపుతామని మాటిస్తున్నామన్నారు. తెలంగాణ అమరవీరులకు జోహార్.. జై తెలంగాణ, జై భారత్‌ అంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.  



Tags:    

Similar News