Minister Tummala : ప్రజలను చులకన చేస్తూ కేసీఆర్ వ్యాఖ్యలు.. మంత్రి తుమ్మల

Byline :  Veerendra Prasad
Update: 2024-02-14 02:04 GMT

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ సభలో ప్రజలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) మండిపడ్డారు. కెసిఆర్ కు ప్రజాస్వామ్యం పై నమ్మకం లేదని, ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవించక పోగా ప్రజలను చులకన చేసి మాట్లాడడం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని అన్నారు. పాలిచ్చే బర్రెను వదులుకొని దున్నపోతుని తెచ్చుకున్నారని కేసీఆర్ అనడం ప్రజాస్వామ్యాన్ని, ప్రజల నిర్ణయాన్ని అపహస్యం చేయడమేనని మండిపడ్డారు. వేదిక మీద పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేసే కేసీఆర్ ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వం గురించి హేళనగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

హోదాకు తగని మాటలవి...

ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. ప్రజల తీర్పును అందరం గౌరవించాలి. కానీ కేసిఆర్ ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని తుమ్మల విమర్శించారు. తనకు ఓటేసినంత కాలం ప్రజలు తెలివైనవారు, వ్యతిరేకంగా ఓటేస్తే మాత్రం పజలు మూర్ఖులన్నట్టు కెసిఆర్ మాట్లాడుతున్నారన్నారు. ఇంతటి రాజకీయ అనుభవమున్న కేసిఆర్ ఒక్క ఓటమితోనే ఓటర్ల విజ్ఞతను శంకిస్తున్నారని... ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లన్న ప్రాథమిక సూత్రాన్ని మరిచి ప్రజలను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం గురించి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అంగీకరించడానికి మాత్రం సిద్ధంగా లేరన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మాట్లాడే భాష, ప్రజాస్వామ్య విలువలకు లోబడి లేదన్నారు.

జవాబు చెప్పే ధైర్యం లేదు.

ఓడిపోయిన 60 రోజులకే అధికారం గురించి ఇంత ఆరాటపడటంతో కేసీఆర్ ఆంతర్యం అర్థం చేసుకోవచ్చని తెలిపారు. వాస్తవాలను మరచి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు దొంగే దొంగ అనట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయితే ఏమి పికనీయ పోయారు అంటూ కేసీఆర్ మాట్లాడడం బాధ్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలెన్నుకున్న సభలో ప్రజా ప్రతినిధుల ప్రశ్నలకు జవాబు చెప్పేధైర్యం లేకనే శాసన సభకు రావడం లేదన్నారు. కేసీఆర్ కాంగ్రెస్‌పై చేస్తున్న ఆరోపణలను జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరని మంత్రి హెచ్చరించారు. 




Tags:    

Similar News