వాగు మింగేసింది.. భద్రాది కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం

By :  Lenin
Update: 2023-07-26 16:15 GMT

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గ్రామాల మధ్య రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక నీటి ప్రవాహం వద్దకు వెళ్లవద్దని, ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, వంకలు దాటవద్దని అధికారులు హెచ్చరిస్తున్నా...కొందరు వినిపించుకోకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు.

తాజాగా భద్రాది కొత్తగూడెం జిల్లా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ములకలపల్లి మండలం చాపరాలపల్లి గ్రామం నుండి కుమ్మరిపాడు గ్రామంకు వెళ్లే రహదారిపై పాములేరు వాగు పొంగిపొర్లుతోంది. ఈ వరద ప్రవాహానికి తల్లి కూతుళ్లు కొట్టుకుపోయారు. కూతురు జ్యోతిని స్థానికులు రక్షించగా, తల్లి కుంజ సీతమ్మ కోసం గాలింపు కొనసాగుతోంది.

కుమ్మరపాడుకు చెందిన కొందరు మహిళా వ్యవసాయ కూలీలు పనులు ముగించుకొని తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఈ క్రమంలో వారు దాటాల్సిన పాములేరు వాగు ప్రమాదకరస్థితిలో ప్రవహిస్తోంది. అయితే ఇంటికి వెళ్లిపోవాలనే ఆలోచనతో వారు వాగు దాటేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 10 మంది కూలీలు ఒకరి చేయి ఒకరు పట్టుకొని ముందుకు కదిలారు. వాగు మధ్యలోకి చేరుకోగానే.. వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో తల్లీ కూతుళ్లు ఒక్కసారిగా వాగులో కొట్టుకుపోయారు. కూతురును రక్షించగా, తల్లి మాత్రం వాగులో కొట్టుకుపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Tags:    

Similar News