Drunk And Driving Cases : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మహిళలు!

Byline :  Veerendra Prasad
Update: 2024-01-01 06:21 GMT

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌, సైబరాబాద్ కమిషనరేట్లలో కలిసి 2700కుపైగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదుచేశారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 1500లకుపైగా కేసులు నమోదవగా, సైబరాబాద్‌లో 1241 కేసులు ఉన్నాయి. తనిఖీల్లో భాగంగా సైబరాబాద్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మహిళలు సహా 1239 మందిపై కేసుల నమోదు చేశారు. 938 బైక్‌లు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1500లకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో పోలీసులతో పలుచోట్ల వాహనదారులు వాగ్వాదానికి దిగారు.

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నవారికి బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేసి.. వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. ఈ తనిఖీల్లో ఓ వ్యక్తికి 544 పాయింట్లు, మరో వ్యక్తికి 484 పాయింట్లు రావడం కలకలం రేపింది. పట్టుబడిన వారిలో 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న వారు 382 మంది ఉండగా.. 26 సంవత్సరాలు నుంచి 35 వయసున్న వారు 536 మంది ఉన్నారు. సైబరాబాద్ కమిషనర్ పరిధిలో ఎక్కువగా మియాపూనర్‌లో 253 కేసులు నమోదు అయ్యాయి. అయితే డ్రగ్స్ కిట్‌తో టెస్టులు చేసినప్పటికీ ఎలాంటి కేసులు నమోదు కాలేదు. న్యూసెన్స్, ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.




Tags:    

Similar News