కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కొనసాగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. నేటి ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరుకు పోలింగ్ జరగనుంది. 1439 ఓటర్ల కోసం జిల్లాలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 2న ఓట్లు లెక్కిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో, మంత్రి జూపల్లి కృష్ణారవు కొల్లాపూర్లో ఓటేయనున్నారు.
బీఆర్ఎస్ నుంచి నవీన్కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు.గురువారం పోలింగ్ జరగనుండగా.. బుధవారం తెల్లవారుజామునే క్యాంపుల నుంచి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. రాత్రికి వారిని హైదరాబాద్లోని రిసార్ట్స్కు తరలించి.. గురువారం ఉదయం నేరుగా ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ సెంటర్లకు తీసుకురానున్నారు. సంఖ్య ప్రకారం బీఆర్ఎస్ కు మెజారిటీ ఉన్నా, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణా మాల క్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్లో చేరారు. గెలుపుపై ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.