Police Arrest Ganja Gang: పానీపూరి బిజినెస్ మాటున గలీజ్ దందా..

Byline :  Veerendra Prasad
Update: 2023-10-18 06:56 GMT

హైదరాబాద్ నగరంలో గంజాయి విక్రయిస్తున్న పానీ పూరీ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కర్ణాటక నుంచి నగరానికి వచ్చిన ఓ మామూలు వ్యక్తి.. ప్రస్తుతం రూ.కోట్ల దందా నడుపుతున్నాడు. అతని చీకటి వ్యాపారం తెలిసి పోలీసులే షాకయ్యారు. టీఎస్‌ న్యాబ్‌ ఎస్పీ సునీతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం బొల్లారం చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులకు గంజాయి తరలిస్తున్న వాహనాలు పట్టుబడింది.ఏపీ నుంచి వస్తున్న డీసీఎం వ్యాన్‌, కారులో 1000 కిలోల గంజాయి అక్రమంగా తరలిస్తున్న కర్ణాటకకు చెందిన ప్రధాన నిందితుడు సాకారం రాథోడ్‌తో పాటు అహ్మద్‌ ఖాన్‌, డి.రాము పవార్‌ , అజయ్‌ రామావతార్‌ చౌరాసియా అనే వ్యక్తులను అరెస్టు చేశారు. పట్టుబడిన ఆ గంజాయి విలువ రూ.3.5కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ప్రధాన నిందితుడు సాకారం రాథోడ్‌ హిస్టరీ తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు. కర్ణాటకలోని ఓ మారుమూల తండా(విజయనగర్‌తండా)కు చెందిన అతడు ఐదో తరగతి వరకు మాత్రమే చదివాడు. 2002లో ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌ నగరానికి వచ్చి ఓ పానీపూరీ బండి వద్ద ఆరేళ్లు పనిచేశాడు. 2010లో షేక్‌పేట్‌ సమీపంలో సొంతంగా పానీపూరీ బిజినెస్ మెుదలుపెట్టాడు. పానీపూరి బండితో పాటు ఈజీ సంపాదన కోసం ఇల్లీగల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఏపీ, ఒడిశా వెళ్లి గంజాయి తీసుకొచ్చి.. పానిపూరి కోసం వచ్చిన యువకులకు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు.

ఈ చీకటి వ్యాపారంలో ఎక్కువ డబ్బులు వస్తుండటంతో ఒడిశాకు చెందిన అజయ్‌ రామావతార్‌ చౌరాసియాతో డీల్ కుదుర్చుకున్నాడు. సరకు తరలించే క్రమంలో రాథోడ్‌ ఓసారి అరెస్టై జైలుకు సైతం వెళ్లాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత పద్దతి మార్చుకోకపోగా.. తమ్ముడు జైదేవ్‌ చౌహాన్‌తో కలసి ఏవోబీ నుంచి గంజాయిని కర్ణాటకకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 4 రోజుల క్రితం రాథోడ్‌ సూచనతో అహ్మద్‌ ఖాన్‌, రాము పవార్‌ మల్కాన్‌గిరి వెళ్లి వ్యాన్‌లో 1000 కిలోల గంజాయిని లోడ్ చేసుకున్నారు. ఆ గంజాయిని కర్ణాటక తరలించాలని చూడగా.. బొల్లారం చెక్‌పోస్టు వద్ద టీఎస్‌న్యాబ్‌ పోలీసులు వీరిని పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు సాకారం రాథోడ్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపారు.

Tags:    

Similar News