లాస్య నందిత పీఏ స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు

By :  Kiran
Update: 2024-02-24 07:00 GMT

కారు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న రెయిలింగ్ కు ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు డ్రైవ్ చేసిన లాస్య నందిత పీఏ ఆకాశ్ ను ప్రశ్నిస్తున్నారు.

కారు ప్రమాదానికి సంబంధించి పటాన్ చెరు పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట ఆకాశ్ స్టేట్మెంట్ రికార్డు చేశారు. అయితే అతను యాక్సిడెంట్ ఎలా జరిగిందో తనకు గుర్తు లేదని చెప్పాడు. పోలీసులు ఎన్ని విధాలుగా ప్రశ్నించినా ఆకాశ్ మాత్రం అదే సమాధానం చెబుతున్నాడు. లాస్య ఆకలిగా ఉందని చెప్పడంతో హోటల్స్ వెతుక్కుంటూ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులకు వివరించాడు. దర్గా నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత లాస్య కారులో ఉన్న ఆమె అక్క కూతరిని వేరే కారులో ఎక్కించి పటాన్ చెరు వైపు వెళ్లామని స్టేట్మెంట్ ఇచ్చాడు.

ప్రస్తుతం మియాపూర్లోని శ్రీకర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న డ్రైవర్ను శుక్రవారం సాయంత్రం కూడా పోలీసులు విచారించారు. ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. ప్రమాదం జరిగిన తీరు, డ్రైవర్ సమాధానాలను చూస్తే ఈ ఘోరానికి డ్రైవర్ నిద్రమత్తే కారణం కావొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. వేగంగా వెళుతున్న క్రమంలో ముందున్న లారీని తప్పించబోయి రెయిలింగ్ ను ఢీ కొట్టి ఉండొచ్చని అంటున్నారు.

లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు దగ్గర ఔటర్ రింగ్పై రెయిలింగ్ను ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన ఆమె స్పాట్లోనే చనిపోయారు. ఆమె పీఏ కమ్ డ్రైవర్ అయిన ఆకాశ్కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు బ్యానెట్ పైభాగం పూర్తిగా ధ్వంసం కాగా, ఎడమ వైపు చక్రం ఊడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోందని, రెయిలింగ్ ను ఢీ కొట్టాక స్పీడో మీటర్ స్ట్రక్ అయిందని పోలీసులు చెప్పారు. 

Tags:    

Similar News