Note for Vote Case: ఓటుకు నోటు కేసు.. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

Update: 2024-02-09 12:45 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీచేసింది. ఓటుకు నోటు కేసు (Note for Vote Case) విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు మార్చాలని ట్రాన్స్ఫర్ పిటిషన్‌ను వేయగా.. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లోగా స్పందించాలని సుప్రీంకోర్టు సూచించింది.

సీఎం, హోం మంత్రిగా ఒకరే బాధ్యతలు నిర్వహిస్తున్నారని వెంటనే ట్రయల్ కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ట్రయల్ మొదలైతే విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని పిటిషనర్ జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది మోహిత్ రావు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఒకవేళ ట్రయల్‌పై అలాంటి ప్రభావం ఉందనుకుంటే తాము ఎలా చూస్తూ ఉంటామని జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో ట్రయల్‌ని నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా పిటీషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం రేవంత్‌ రెడ్డిపై 88 క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.




Tags:    

Similar News