నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ : ప్రియాంక గాంధీ

By :  Krishna
Update: 2023-11-24 10:56 GMT

నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగ పరీక్షల్లో ఎంతో అవినీతి జరిగిందని.. పరీక్షల పేపర్లు లీక్‌ కావడంతో యువత ఆశలు ఆవిరయ్యాయని చెప్పారు. యువత సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు. పాలకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో ప్రియాంక ప్రసంగించారు. కాంగ్రెస్ను గెలిపిస్తే నిరుద్యోగులు సహా ప్రజల కష్టాలు తొలగిపోతాయని అన్నారు.

పాలకుర్తిలో ఝాన్సీ కుటుంబం ప్రజలకు ఎంతో సేవ చేస్తే.. మరో కుటుంబం ప్రజల భూములు లాక్కుందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు కలగానే మిగిలాయని చెప్పారు. తెలంగాణలో రైతులు కష్టాల్లో ఉన్నారని, రైతుల నుంచి బిఆర్‌ఎస్ భూములు లాక్కుందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ మోసపు మాటలు నమ్మొద్దని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని ఎద్దేవా చేశారు.

మహిళల కష్టం తమకు తెలుసని.. అందుకే వారికి ఉచిత బస్సు సౌకర్యం సహా నెలకు రూ. 2500, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రియాంక గాంధీ చెప్పారు. తెలంగాణలో యువశక్తి, నారీశక్తిని చూస్తే.. గర్వంగా అనిపిస్తోందన్నారు. అంతేకాకుండా రైతులకు 2లక్షల రుణమాఫీ, ఏటా 15వేల పెట్టుబడి సాయం, రైతు కూలీలకు 12వేల సాయం అందిస్తామన్నారు. 10లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ, విద్యార్థులకు 5లక్షల సాయం అందిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తామన్నారు. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News