కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.83వేల కోట్ల నిధులు ఏమయ్యాయి: సీఎం రేవంత్ రెడ్డి

By :  Bharath
Update: 2023-12-13 16:05 GMT

ధరణి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏమయ్యాయి? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ధరణి పోర్టల్ పై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి బుధవారం సచివాలయంలో ధరణిపై సమీక్షించారు. ఈ క్రమంలో ధరణిపై సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిత్తల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో భూముల సర్వే, డిజిటలైజేషన్, టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.83వేల కోట్లు ఏమయ్యాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

నిషేధిత భూముల జాబితా, అసైన్డ్ భూముల వివరాలతో పాటు మంత్రులు లేవనెత్తిన అంశాలపై నివేదిక ఇవ్వాలని నవీన్ మిత్తల్‌ను సీఎం ఆదేశించారు. భూముల డిజిటలైజేషన్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి.. సామాన్యులకు సమస్యగా మారిందని రేవంత్ అన్నారు. కాగా ధరణిని రద్దు చేసి ఆ స్థానంలో భూమాత పోర్టల్ ను తీసుకొస్తామని ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ దిశగా రేవంత్ అధికారులతో దాదాపు రెండు గంటలకు పైగా సమీక్షించారు.


Tags:    

Similar News