ఇవాళ్టి నుంచి రైతుబంధు పంపిణీ.. ఫస్ట్ ఎవరికంటే..?

Update: 2023-06-26 02:56 GMT

రాష్ట్రంలో రైతు బంధు పంపిణీకి అంతా సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం పెట్టుబడి సాయం జమ చేయనుంది. 70 లక్షల మంది రైతులకు రైతుబంధు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. గతంతో పోల్చితే ఈ సీజన్‌లో 5 లక్షల మంది రైతులకు కొత్తగా సాయం అందిస్తున్నట్లు వివరించింది. అదేవిధంగా 1.5 లక్షల మంది పోడు రైతులకు సైతం రైతుబంధు ఇవ్వనుంది.

తొలుత తక్కువ భూమి ఉన్న రైతుల అకౌంట్లలో రైతు బంధు సొమ్ము జమచేస్తారు. అనంతరం ఎక్కువ భూమి ఉన్న వారి ఖాతాలకు పెట్టుబడి సాయం ట్రాన్స్ఫర్ చేయనున్నారు. గతేడాది వానకాలం సీజన్‌లో మొత్తం 68.94 లక్షలు మందికి రైతు బంధు అందింది. 1.53 కోట్ల ఎకరాల భూమికి రూ.7,654.43 కోట్ల సాయం అందజేశారు. అయితే ఈసారి ఆ సంఖ్య పెరిగింది. రైతుబంధు రాని రైతులు తమ గ్రామ ఏఈఓలకు తమ వివరాలను అందజేయాలని అధికారులు ఇప్పటికే సూచించారు.




 


2018 వానకాలం సీజన్‌ నుంచి కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది. ఏటా రెండు సీజన్లకు ఆర్థికసాయం అందిస్తోంది. ఇలా 9 సీజన్లలో రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.10 వేలు చొప్పున పెట్టుబడి సాయం అందించారు. ఈ పథకం కింద రాష్ట్ర రైతులకు ఇప్పటి వరకు రూ. 58,102 కోట్ల సాయం చేశారు. 

Tags:    

Similar News