Cabinet Meeting: కేబినెట్ భేటీ... రాష్ట్ర అధికార గీతంగా ‘జయ జయహే తెలంగాణ’

Byline :  Veerendra Prasad
Update: 2024-02-04 16:21 GMT

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో భేటీ అయిన తెలంగాణ కేబినెట్ కాసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార గీతంగా ‘జయ జయహే తెలంగాణ’కు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇక ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు హామీల్లోని రెండు హామీలైన రూ. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 కే గ్యాస్ సిలెండర్ పథకాలను కేబినెట్ ఆమోదం తెలిపింది. వాహనాలకు ఉన్న నంబర్ ప్లేట్లపై తెలంగాణ స్టేట్(TS).. టీజీ(TG)గా మార్చడానికి కూడా మంత్రి వర్గం ఓకే చెప్పింది. ఈ నెల 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఈసారి పూర్తి బడ్జెట్ కాకుండా… ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను బ్యాలెన్స్ చేసి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

కేబినెట్ భేటీ తర్వాత మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. మంత్రి వర్గ సమావేశంలో కులగణనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు.హైకోర్టుకు వంద ఎకరాల భూమిని కేటాయించినట్లు చెప్పారు. ఖైదీల క్షమాభిక్షకు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పారు. మరో రెండు గ్యారంటీలను కూడా త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తారని చెప్పారు. ప్రజాపాలనలో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ ఆథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రెడ్ చేయాలని నిర్ణయించిందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు అందించే నైపుణ్య అభివృద్ధి కోర్సులు అందించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరిద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని తెలిపారు. ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

కృష్ణా జిల్లాల వాటా కోసం బీఆర్ఎస్ పోరాటం చేయలేదని, పక్క రాష్ట్రాలతో లోపాయికారి ఒప్పందం చేసుకుందన్నారు మంత్రి పొంగులేటి. తమ ప్రభుత్వతం వచ్చి 2 నెలలు కాకముందే .. తమపై బట్ట కాల్చి వేస్తారా అని మండిపడ్డారు. ఇక మహాలక్ష్మీ పథకం కింద 14 కోట్ల 25 లక్షల మంది ఉచితంగా బస్సుల్లో ప్రయాణించారని చెప్పారు

Tags:    

Similar News