నన్ను రారా పోరా అనేది కిషన్ రెడ్డి మాత్రమే.. బండి

Update: 2023-07-06 14:58 GMT

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే తమ లక్ష్యమని తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో తమ పార్టీ రాష్ట్రంలో అధికారలోకి రావడం ఖాయమని, గడీల పాలన, అవినీతి పాలన అంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి కిషన్ రెడ్డితో కలసి గురువారం హైదరాబాద్ చేరుకున్న ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తనకు తొలినుంచి కిషన్ రెడ్డితో మంచి అనుబంధముందని చెప్పారు.

‘‘నన్ను రారా, పోరా అనే చనువు కిషన్ రెడ్డికి మాత్రమే ఉంది. విద్యార్థి పరిషత్‌లో, యువమోర్చాలో ఉన్నప్పుడు ఏవైనా గొడవలు జరిగితే నువ్వు చూస్కోరా భయ్ అనేవారు. ఎలాంటి సమస్య వచ్చినా ఆయనకే ఫోన్ చేసేవాడిని. కిషన్ రెడ్డి జాతీయ బీజేపీ బలోపేతం కావడానికి ఎంతో కష్టపడ్డారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు పార్టీ మద్దతు కూడగట్టారు’’ అని బండి ప్రశంసించారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో ఎలాంటి విభేదాలూ లేవని, అందరూ ఏకతాటిపై నడుస్తున్నారని చెప్పారు. ఈ నెల 8న వరంగల్‌లో జరగనున్న మోదీ సభకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కొందరు విష ప్రచారం చేస్తున్నారు, దాన్ని తిప్పకొట్టి జయప్రదం చేయాలని కార్యకర్తలను కోరారు.

Tags:    

Similar News