తెలంగాణకు చెందిన మరో బీజేపీ నేత గవర్నర్గా నియామకమయ్యారు. త్రిపుర గవర్నర్ గా ఇంద్రసేనారెడ్డిని నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. తనను గవర్నర్ గా నియమించడం పట్ల ఇంద్రసేనా రెడ్డి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే ఇద్దరు బీజేపీ నేతలు గవర్నర్లుగా పనిచేస్తున్నారు. మిజోరం గవర్నర్గా కంభంపాటి హరిబాబు, హరియాణా గవర్నర్ గా బండారు దత్తాత్రేయ ఉన్నారు. ఇంద్రసేనారెడ్డి నియామకంతో ఆ సంఖ్య మూడుకు చేరింది.
గత నాలుగు దశాబ్దాలుగా ఇంద్రసేనారెడ్డి బీజేపీలో కొనసాగుతున్నారు.1953లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామంలో ఆయన జన్మించారు. 2003 నుంచి 2007 వరకు ఉమ్మడి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1983, 1985, 1999 ఎన్నికల్లో మలక్ పేట్ నియోజకవర్గం నుంచి గెలిపొందారు. 2004లో నల్గొండ, 2014లో భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో పార్టీ జాతీయ కార్యదర్శిగా, 2020లో పార్టీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయనను గవర్నర్ గా నియమించడం గమనార్హం.