దిగొచ్చిన కౌశిక్ రెడ్డి...ముదిరాజులకు క్షమాపణలు

Update: 2023-06-27 05:34 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఎట్టకేలకు దిగొచ్చారు. ముదిరాజు వర్గాలకు క్షమాపణలు చెప్పారు. కావాలనే కొంత మంది తనపైన సోషల్ మీడియాలో నకిలీ ఆడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముదిరాజుల మనోభావాలను నిజంగా తాను కించిపరిచి ఉంటే క్షమాపణలు అని తెలిపారు. " సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో నాది కాదు. అది ఫేక్‎ది. దయచేసి దానిని ఎవరూ నమ్మకండి. నాకు అన్ని కులాలు ఒక్కటే. ఇప్పటి వరకు నేను ఏ కులాన్ని కించపరిచి మాట్లాడలేదు. నా ఆడియో రికార్డును ఫోరెన్సిక్ ల్యాబ్‎కు పంపాను. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్‎కు కంప్లైంట్ ఇచ్చాను. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజల్లో నాకు పెరుగుతున్న పాపులారిటీని చూసి కొంత మంది ఓర్వలేకే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. నాపై కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు. ముదిరాజుల సామాజిక వర్గాలు ఈ నిజాలను తెలుసుకోవాలి"అని కౌశిక్ రెడ్డి తెలిపారు.

హుజూరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జ్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ముదిరాజు వర్గానికి చెందిన ఓ విలేఖరిని కులం పేరుతో దూషించినట్లు ఉన్న ఆడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. దీంతో కౌశిక్ రెడ్డి తీరుతో ముదిరాజులు మండిపడుతున్నారు. తమ కులాన్ని తక్కువ చేస్తూ మాట్లాడినందుకు గాను కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ముదిరాజులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి, కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. దీంతో కౌశిక్ రెడ్డి ఈ విషయంలో రెస్పాండ్ అయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో ఫేక్ అని చెబుతూనే ముదిరాజులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు.  


 


 


 

 

Tags:    

Similar News