'ఆంధ్రా గురించి మాకెందుకు.. మాది మాకే ఉంది'.. కోమటిరెడ్డి

Byline :  Veerendra Prasad
Update: 2023-09-29 09:23 GMT

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌పై మీ కామెంట్స్ ఏంటి? అని అడిగిన జర్నలిస్టులకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శుక్రవారం నాడు తన నివాసం జరిగిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ... చంద్రబాబు అరెస్ట్ గురించి పట్టించుకోవడం లేదన్నారు. టీవీ ఛానళ్లలో ఆ అరెస్టుకు సంబంధించిన కథనాలు వస్తుంటే వెంటనే టీవీ ఆఫ్ చేస్తున్నానని అన్నారు. చంద్రబాబుకు సంబంధించిన వార్తలు చదవడమే మానేశానని అన్నారు. అసలు బాబు అరెస్ట్‌పై తానేమీ మాట్లాడదలుచుకోలేదన్నారు. అయినా ఆంధ్రా గురించి మాకెందుకు అని ఆయన అన్నారు. తమ దృష్టంతా కేసీఆర్ పైనే ఉందన్నారు. మాది మాకే ఉంది... కేసీఆర్ ను గద్దె దింపడంపైనే కేంద్రీకరించినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ గురించి పట్టించుకొనే సమయం తనకు లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

ఇదే సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ టార్గెట్‌గా మంత్రి హరీష్ రావు ఇటీవల చేసిన కామెంట్స్‌పై సీరియస్‌గా రియాక్ట్ అవుతూ... ‘హరీష్‌… బీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతుందో తెలుసుకో!’ అంటూ మంత్రికి హితవు చెప్పారు. కోట్ల రూపాయకు టిక్కెట్లు అమ్ముకోలేదా? అని ప్రశ్నించారు. టిక్కె్ట్లు అమ్ముకునే పరిస్థితి బీఆర్‌ఎస్‌లోనే ఉందన్నారు. మంత్రి హరీష్ రావుకు దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి 24గంటల కరెంట్‌ ఇస్తున్నట్టు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని.. ఒకవేళ నిరూపించకపోతే హరీష్ రావు తన పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు.

తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తమ పార్టీ ఇచ్చిన 6 హామీలను అమలు చేస్తామన్నారు. తాము చేసే చెబుతామని, చెప్పింది చేసి తీరుతామన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా 80 నుంచి 85 సీట్లు వస్తాయని, ఈసారి కేసీఆర్ ఇంటికి వెళ్లడం ఖాయం అని వ్యాఖ్యానించారు.




Tags:    

Similar News