రాష్ట్రం ప్రభుత్వ అన్యాయాలను కేంద్రం అడ్డుకోలేకపోతుందని రాజీనామా

Update: 2023-08-13 03:14 GMT

ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగలింది. బీజేపీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి శనివారం రాత్రి ఆయన రాజీనామా లేఖ రాశారు. ఆయన రాసిన రాజీనామా లేఖను అంగీకరించాల్సిందిగా కిషన్ రెడ్డిని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను కేంద్రం అడ్డుకోలేకపోతుందని చంద్రశేఖర్ తన లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలోని బీజేపీ సర్కార్‌కు అన్నీ తెలిసినా తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలకడం ప్రజాకంఠకంగా మారిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరై పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన వెల్లడించారు. 30 ఏళ్ల తన రాజకీయ ప్రస్తానంలో ప్రజల మేలు కోసం, ప్రజల అభీష్టం మేరకే ఇన్నేళ్లు రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పుకొచ్చారు.

తెలంగాణ ఉద్యమంలో 12 ఏళ్లు పని చేశానని.. ఆ క్రమంలో మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్ర యువతకు ఉద్యోగాలు, రైతుల పొలాలకు నీళ్లొస్తాయని అనుకుంటే అది కలగానే మిగిలిందని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నివారించి తెలంగాణకు న్యాయం చేస్తుందని భావించి అనేక మంది ఉద్యమ నాయకులు బీజేపీలో చేరి భంగపాటుకు గురవుతున్నారని లేఖలో పేర్కొన్నారు. పార్టీకి పనిచేసే నాయకులను ప్రోత్సహించకపోవడం శోచనీయమన్నారు. పార్టీలో తాను కొనసాగిన మూడేళ్ల పాటు తనతో సహకరించిన, కలిసి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇక బీజేపీకి గుడ్‌బై చెప్పిన చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలిసింది. ఇప్పటికే హస్తం పార్టీకి చెందిన కీలక నేతలు ఆయనతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో చేవెళ్ల లేదా జహీరాబాద్‌ నుంచి చంద్రశేఖర్‌ను బరిలో దించాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం గూటికి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



Tags:    

Similar News