Telangana Government : విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Update: 2024-01-23 02:09 GMT

ఇంజనీరింగ్ చదవాలకునే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో తొలి ఇంజనీరింగ్ కాలేజ్ అందుబాటులోకి రానుంది. సీఎం రేవంత్‌రెడ్డి హామీ మేరుకు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు అక్కడి పాలిటెక్నిక్ కళాశాలను ఇంజీనీరింగ్ కాలేజీగా ఆప్‌గ్రేడ్ చేసింది. అంతే కాదు, మున్ముందు మరిన్ని సర్కారు ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని పేర్కొంది.ఈ పాలిటెక్నిక్‌ను ఉన్నతీకరిస్తూ (అప్‌గ్రెడేషన్‌) విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచే ఇక్కడ ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభించనున్నారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ కళాశాలలో మూడు బీటెక్‌ బ్రాంచీలు (180 సీట్లు) అందుబాటులోకి రానున్నాయి. బీటెక్‌ సీఎస్‌ఈ, సీఎస్‌ఈ (ఏఐ అండ్‌ ఎంఎల్‌), సీఎస్‌ఈ (డేటా సైన్స్‌) కోర్సులను ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది.

రాష్ట్రంలో ఇంతవరకు ఉన్న కళాశాలలు ఆయా విశ్వవిద్యాలయాల కళాశాలలే. అంటే అవి జేఎన్‌టీయూహెచ్‌, ఓయూ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. కోస్గి ఇంజినీరింగ్‌ కళాశాల మాత్రం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మౌలిక వసతుల కల్పన, బోధన, బోధనేతర సిబ్బంది నియామకం, వారి వేతనాలు తదితర వాటిని ఆ శాఖే చేపడుతుంది. అయితే ప్రభుత్వ లేదా ప్రైవేటు కళాశాల ఏదైనా ఏదో ఒక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండాలి. అంటే.. ఒక వర్సిటీ నుంచి అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్‌) తీసుకోవాలి. ఆ విశ్వవిద్యాలయం రూపొందించిన సిలబస్‌ను ఆ కళాశాల పాటించాలి. పరీక్షల నిర్వహణ, ధ్రువపత్రాల జారీ వర్సిటీ చేస్తుంది. ఈ మేరకు కోస్గిలో ఏర్పాటయ్యే కళాశాల జేఎన్‌టీయూహెచ్‌కు అనుబంధంగా ఉండనుంది.ఇంజినీరింగ్‌ కళాశాలగా స్థాయి పెరిగినా ప్రస్తుతం కొనసాగుతున్న పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు యథాతథంగా కొనసాగుతాయి.

Tags:    

Similar News