DALIT BANDHU:రెండో విడత దళితబంధుకు గ్రీన్ సిగ్నల్.. ఎప్పుడంటే..

రెండో విడత దళితబంధుకు గ్రీన్ సిగ్నల్.. ఎప్పుడంటే..

Update: 2023-06-25 02:45 GMT



దళిత జాతి ఆర్థికపరంగా బలంగా, స్వశక్తితో జీవించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్​ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. హుజురాబాద్​ బై ఎలక్షన్ సమయంలో ఆ నియోజవర్గంలోని 14,400 మంది ఖాతాల్లో తొలి విడతగా ఒక్కొక్కరికి రూ.10లక్షలు చొప్పున మొత్తం రూ.500 కోట్లను జమ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. తొలి విడత దళితబంధు విజయవంతం కావడంతో తెలంగాణ ప్రభుత్వం తాజాగా రెండో విడత లబ్ధిదారుల ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నిన్న(శనివారం) రాత్రి తెలంగాణ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.

ఈసారి 1,29,800 మందికి

దళిత బంధు రెండో విడత ఆర్థిక సాయానికి ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్​ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. రెండో విడతలో 1.30 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని.. లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి 1100 మందికి దళిత బంధు అందించడానికి కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 118 నియోజకవర్గాలలో 1,29,800 మందికి ఈ దళిత బంధు పథకాన్ని అందజేయాలనుకుంటున్నది. నిబంధల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులతో సంప్రదించి ఒక్కో నియోజకవర్గంలో (హుజూరాబాద్ మినహా) 1100 ఎస్సీ కుటుంబాలను గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. అతి త్వరలోనే లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షలు పడనున్నాయి.

2023-24 రాష్ట్ర బడ్జెట్​ లో బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు నిధుల కింద రూ.17,700 కోట్లను కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దళితులు ఆ సంపదను పెట్టుబడిగా పెట్టుకొని.. ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది.




Tags:    

Similar News