Telangana Rythu Runa Mafi : రైతన్న రుణమాఫీ.. ఎప్పుడంటే

Byline :  Veerendra Prasad
Update: 2024-02-13 01:18 GMT

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం... ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేసింది. మరో రెండు గ్యారంటీల అమలకు రెడీ అయింది. ఇక 6 గ్యారంటీల్లో అతి ముఖ్యమైన రైతులకు ఇచ్చిన రూ. 2 లక్షల రుణమాఫీపై కసరత్తు ప్రారంభించింది. ఈ హామీ అమలుపై చాలా మంది రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. రైతు రుణమాఫీపై మెున్న జరిగిన బడ్జెట్ ప్రసంగంలోనూ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు. పథకం అమలుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

తాజాగా.. ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి కూడా రైతు రుణమాఫీపై కీలక అప్డేట్ ఇచ్చారు. రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ఉందని, అందుకు సంబంధించిన పూర్తి సమాచారం రాగానే కార్యరూపం దాల్చుతుందని చెప్పారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి ఆయన సోమవారం గాంధీభవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

అక్రమంగా భూములు పొందిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ధాన్యంకు మద్దతు ధర కంటే తక్కువ వచ్చినప్పుడు బోనస్‌ రూ.500 ఇస్తామని అన్నారు. ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర రూ.2060 కాగా.. కొనుగోలు కేంద్రాల్లో రూ.2600 ఇస్తున్నారన్నారు. అందుకే బోనస్‌ గురించి ప్రస్తావించలేదని చెప్పారు.




Tags:    

Similar News