BRS వచ్చాకే రాష్ట్రంలో ఉచిత కరెంట్ వచ్చినట్లు మాట్లాడుతున్నరు.. డిప్యూటీ సీఎం

Byline :  Veerendra Prasad
Update: 2023-12-21 06:20 GMT

రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళన కరంగా ఉందని, ఇప్పటివరకు విద్యుత్ రంగంలో 81 వేల కోట్ల అప్పు ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక.. రాష్ట్రంలో విద్యుత్ రంగంపై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడారు. పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగం పురోగతికి నమ్మకమైన విద్యుత్ సరఫరానే వెన్నుముక అని భట్టి అన్నారు. రవాణా, సమాచార రంగాల మనుగడకు విద్యుత్ సరఫరా కీలకమన్నారు. విద్యుత్ రంగం పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఆర్థిక పురోగతిలో విద్యుత్ రంగానిది కీలక పాత్ర అన్నారు.రాష్ట్ర ప్రజల నాణ్యమైన జీవనశైలిని సూచించేది కూడా విద్యుతేనని భట్టి విక్రమార్క వివరించారు.

తెలంగాణ వచ్చాక ఉత్పత్తి ప్రారంభించిన విద్యుత్‌ కేంద్రాలే నాణ్యమైన విద్యుత్‌ అందించాయని భట్టి పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా, ఉత్పత్తి గురించి తెలియాలనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామన్నారు. డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయన్నారు. గత ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తామన్న బాకీలు చెల్లించలేదన్నారు. డిస్కంలకు ప్రభుత్వ శాఖల బకాయిలు రూ.28, 842 కోట్లు ఉందన్నారు. 2023 నాటికి విద్యుత్ రంగంలో రూ.81, 516 కోట్లు అప్పు ఉందని భట్టి అసెంబ్లీలో వెల్లడించారు.

రూ 14,928 కోట్ల భారం డిస్కంల ఆర్థిక స్థితిని మరింత కుంగదీశాయని అన్నారు. గతప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తామన్న బకాయిలు చెల్లించకుండా మాట తప్పిందని భట్టి విమర్శించారు. రోజువారీ మనుగడ కోసమే డిస్కంలు అలవికానీ అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో విద్యుత్ వచ్చినట్లు , వాళ్లే ఉచిత విద్యుత్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు మరింత ఆందోళనకరంగా మారాయని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి దూరదృష్టి లేకపోవడం వల్లే విద్యుత్ ఇబ్బందులు ఏర్పడ్డాయని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టిందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

Tags:    

Similar News