పార్టీ మారి బీజేపీలో చేరినోళ్లకి ప్రాధాన్యం ఉండదు.. కిషన్ రెడ్డి

పార్టీ మారి బీజేపీలో చేరినోళ్లకి ప్రాధాన్యం ఉండదు.. కిషన్ రెడ్డి

By :  Lenin
Update: 2023-07-21 02:56 GMT


'ఛలో బాటసింగారం' పేరుతో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పరిశీలించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నిన్న చేసిన హడావుడి అంతా సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కిషన్‌రెడ్డి .. ఎమ్మెల్యే రఘునందన్ రావుతో (MLA Raghunandan rao) కలిసి బాటసింగారంకు బయలుదేరగా.. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్‌రావు, చింతల రాంచంద్రారెడ్డితో కలిసి కిషన్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి.. బీజేపీ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేయడం, గృహనిర్బంధం చేయడం దుర్మార్గంగా పేర్కొన్నారు. పేదలకోసం గొప్పగా కట్టామని చెబుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చూడడానికి వెళ్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉలికిపాటెందుకని ప్రశ్నించారు. తాము చేసేది ఉద్యమమా? లేక తిరుగుబాటా? అని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి.. తన మనసులో మాటను బయటపెట్టారు. వేరే పార్టీలోనుంచి వచ్చినవాళ్లకు బీజేపీలో ప్రాధాన్యం ఉండబోదని మీడియా సాక్షిగా చెప్పారు. ‘మా రాజకీయ జీవితమే పోరాటాలతో ప్రారంభమైంది. మేం పార్టీలు మారిన వ్యక్తులం కాదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో పక్కనే ఉన్న రఘునందన్‌రావు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కిషన్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలోనూ దుమారం రేపుతున్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి వచ్చిన ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ నుంచి వచ్చిన డీకే అరుణ తదితర నాయకులపై కూడా ‘పార్టీలు మారినోళ్లేననే’ వివక్ష ఉందనడానికి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. తామంతా ఒక్కటేనని చెప్పుకుంటున్నా.. కిషన్‌రెడ్డి వ్యవహారంతో మరోసారి బీజేపీలో లుకలుకలు బయటపడ్డాయని ప్రజలు చర్చించుకొంటున్నారు.


Tags:    

Similar News