Satavahana Express: శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు

Byline :  Veerendra Prasad
Update: 2024-01-14 08:12 GMT

ఇటీవల వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల పట్టాలు తప్పడం, రైళ్లలో పొగలురావడం వంటి ఘటనలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. నాలుగు రోజుల క్రితం చార్మినార్ ఎక్స్‌ప్రెస్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో పట్టాలుతప్పింది. ఈ ఘటనలో పది మంది వరకూ గాయపడ్డారు. ఆ ఘటన మరవక ముందే.. తాజాగా మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వచ్చాయి. దీంతో అప్రపమత్తమైన ప్రయాణికులు తమ లగేజీలతో సహా ట్రైన్ నుంచి దూకి పరుగులు తీశారు. ఏ భోగిలో మంటలు అంటుకున్నాయో తెలియక భయంతో వణికిపోయారు. ప్రయాణికుల సమాచారం మేరకు లోకో పైలెట్ పొగలు వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించగా.. బ్రేక్ లైనర్లు పట్టేయడంతోనే పొగలు వచ్చాయని గ్రహించాడు

ఆదివారం మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా పొగలు చెలరేగాయి. బ్రేక్ లైనర్లు అంటుకోవడంతో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. సూట్ కేసులు, బ్యాగులు సర్దుకుని రైలు నుంచి కిందికి ప్రయత్నించారు. అయితే కొందరు ప్రయాణికులు అప్రమత్తమై రైల్ లోని సేప్టీ చైన్ లాగడంతో రైల్ అధికారులు వచ్చారు. ఏంజరిగిందనే ఆరా తీయగా బ్రేక్ లైనర్ల నుంచి పొగలు రావడం గమనించారు. ప్రయాణికులు భయపడాల్సిన పని లేదని సూచించారు. పొగలను అదుపు చేస్తున్నారని ప్రయాణికులకు అప్రమత్తం చేశారు. రైలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులు దీనికి సహకరించాలని సూచించారు. ఈ ఘటనతో రైలు దాదాపు 15 నిమిషాల పాటు అక్కడే నిలిచిపోయింది. రైల్వే సిబ్బందికి సమాచారం అందించడంతో.. ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది బ్రేక్ లైనర్లను సరిచేయడంతో రైలు అక్కడి నుంచి కదిలింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News