నెంబర్ ప్లేట్ మార్చి రోడ్డెక్కితే జైలుకే.... పోలీసుల ఉక్కుపాదం

Update: 2023-07-10 05:49 GMT

ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు వెహికల్ నెంబర్ల ట్యాంపరింగ్ చేస్తే ఇకపై క్రిమికల్ కేసులు పెట్టి జైలుకు పంపుతామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్పుడు నెంబరు ప్లేట్లు, కొట్టేసిన వాహనాలతో పోలీసుల్ని బురిడీ కొట్టిస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్‌లో క్రమం తప్పకుండా తనిఖీలు, నాకా బందీ, ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా ఈ తరహా వాహనాలను గుర్తిస్తున్నారు. రాచకొండ పోలీసుల సర్వే ప్రకారం.. సరాసరి 100 నేరాలు జరిగితే.. 60 శాతం కేసుల్లో నిందితులు తప్పుడు ప్లేట్ల వినియోగిస్తున్నట్లు తేలింది. గంజాయి స్మగ్లింగ్, చైన్‌ స్నాచింగ్, దోపిడీ కేసుల్లో దాదాపు 90 శాతం ఇవే ఉంటున్నాయి. కొందరు నేరస్థులు తాము నేరం చేసే సమయంలో అప్పటికప్పుడు వాహనాలు కొట్టేసి వాటినే వినియోగిస్తున్నారు.

నెంబర్ ప్లేట్లు మార్చిడం లేదా ట్యాంపర్ చేసి వాహనాలు నడుపుతున్న వారిపై రాచకొండ పరిధిలో ఏడాదిలో ఇప్పటివరకు 199 మంది వాహనదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. కోర్టు వారిలో 13 మందికి సాధారణ జైలుశిక్ష, 55 మందికి సామాజిక సేవ శిక్షలు విధించాయి. గొలుసు దొంగతనాలు, ఇళ్లల్లో చోరీలు, ఇతర కేసుల్లో ఎక్కువ మంది నిందితులు తప్పుడు నెంబరు ప్లేట్లు వినియోగిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నెంబరు ప్లేటు ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించడంతో పెద్దఎత్తున వాహనాలు పట్టుబడుతున్నాయి.

రాచకొండ పరిధిలో గతేడాది మొత్తం 31,712 నెంబరు ప్లేటు ట్యాంరింగ్ ఘటనలు నమోదయ్యాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే రెట్టింపు సంఖ్యలో 69,420 కేసులు నమోదు చేసి రూ.1.56 కోట్ల జరిమానాలు విధించారు. నిరంతర డ్రైవ్‌లు, తనిఖీలతో ఈ తరహా ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేస్తే నేరస్థులు భయపడతారని రాచకొండ సీపీ చౌహాన్ చెబుతున్నారు. ఫలితంగా నేర నియంత్రణ సాధ్యమవుతుందని.. సాధారణ వాహనదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనాలకు నెంబరు ప్లేట్లు బిగించుకోవాలని తెలిపారు.



Tags:    

Similar News